My pic

Jan 4, 2011

సంపూర్ణ శ్రీ రామాయణము - చాగంటి వారి అద్భుత ప్రవచనములు

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనాలని గత నెల రోజులుగా వింటూ చాల ఆనందిస్తున్నాను. చాగంటి వారి జనరంజకమైన ప్రవచనాలను ఎవరైనా సరే ఒక సారి వినడం మొదలు పెడితే పూర్తి అయ్యేవరకు ఆపలేరు, అంత అద్భుతంగా ప్రసంగిస్తారు వారు.

శ్రీ రాముని కటాక్షము సంపూర్ణంగా వారి పైన వున్నదని శ్రోతలు బాలకాండ మొదట్లోనే గ్రహించగలరు. యుగాలు మారినా సనాతన ధర్మము భారతీయ జన జీవనంలో "సూత్రే మణి గణాయివ" అన్నట్టు ఎట్లా ఇమిడి పోయి ఉన్నదో చాగంటి వారి ప్రసంగాలలో తేట తెల్లమౌతుంది.

ఆధునిక సంస్కృతికి అలవాటు పడి డబ్బు సంపాదన, ఐహిక సుఖము ముఖ్య ధ్యేయంగా స్వధర్మమును మరచిపోతున్న ఈనాటి యువతరానికి ఈ ప్రవచనాలు సనాతన ధర్మము పట్ల కనువిప్పు కలిగిస్తాయి.

వారి మాటల్లో "శ్రీ రామాయణాన్ని పరమేశ్వరుని అవతార కథగా కంటే ఒక నరుని కథ గా వింటే" ఈనాటి సమాజానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.

సీతా రాముల అన్యోన్య దాంపత్యాన్ని వారు ప్రత్యేకంగా పేర్కొంటారు, పెళ్లి కాబోయే యువతీ యువకులు చదివితే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, గౌరవము, అనురాగము పెరుగుతాయి.

శ్రీ రాముని ధర్మ నిరతి, భ్రాత్రు వాత్సల్యము, సర్వ భూతములయందు ప్రేమ, పరాక్రమము, సీతయందు గాఢమైన అనురాగము చాగంటి వారు ఆవిష్కరించిన రీతి అనితర సాధ్యము. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శ్రీ రాముని గాంభీర్యము భారతీయ యువతి యువకులకు ఆదర్శము. చాగంటి వారు ఈ విషయాలను మళ్లీ మళ్లీ తమ ప్రవచనాలలో పేర్కొంటారు.

ఈ ప్రసంగాలలో నాకు నచ్చిన ఘట్టాలు "రామ భరత సంవాదము" "సీతా అనసూయ సంవాదము" "రాముని విలాపము" "సీతాన్వేషణము" అసలు ఒకటేమిటి అన్నీ అత్యద్భుతంగా వివరిస్తారు చాగంటి వారు.

వారి శ్రీ రామాయణ ప్రసంగాలను అన్నీ విన్న తరువాత శిరసు వంచి వారికి ప్రణామము చేస్తున్నాను. వారి హృదయంలోని శ్రీ రాముని మన కళ్ళ ముందర చూపించి ఎందరినో ధన్యులను గావిస్తున్న వారు నిజంగానే "సరస్వతి పుత్రులు".

Jun 16, 2010

గిరిజా కళ్యాణం

చాల రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్న ఒక పాట You Tube లో ముక్కామల వెంకట సుబ్బా రావు గారు పపబ్లిష్ చేశారు. "రహస్యం" సినిమా లోని గిరిజా కళ్యాణం అనే పాట. ముక్కామల గారికి అనేక కృతజ్ఞతలు.

తెలుగు వారికే సొంతమైన భాగవత నృత్య నాటక రీతిలో సాగుతుంది ఈ పాట. శివ పార్వతీ కళ్యాణ నేపథ్యంలో, శివుడు మన్మథుని అనంగుని చేయుట, రతి దేవి విలాపము, పార్వతి ప్రార్థనల తో మన్మథునికి తిరిగి రూపాన్నిఇవ్వడము ఈ రూపక సారాంశము.
రాగ మాలిక లో ఘంటసాల మాస్టారు గారి సంగీతం, సుశీల, లీల ల తో కలసి పాడిన తీరు అద్వితీయం. ఈ పాట లో మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలి,

"సామగ సాగమ సాధార, దీనాధీనా ధీసార"
"చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింత"
"వినక పోతివా ఇంతటితో, నీ విరి శరముల పని సరి..."

బహుశ: తెలుగు లో ఇంత మంచి పదాల వాడుక అదీ భాగవతుల నాటక పద్ధతతికి అనుగుణంగా వ్రాయటం శాస్త్రి గారికే సాధ్యమైన ప్రక్రియ అనుకుంటా!...

మన్మథుడు పార్వతితో పలికే మాటలు వింటే శాస్త్రి గారి పద ప్రయోగ చాతుర్యానికి ఆశ్చర్య పోక తప్పదు
"తగదిది తగదిది తగదిది తగదిది ధరణీ ధర వర సుకుమారి తగదిది" (భాగవత నృత్యం కాబట్టి అది "తక దిగి" కి దగ్గరగా తగదిది అనే పదాన్ని వాడడం చాల బావుంటుంది )
"అండగా మదనుడుండగా, మన విరి శరముల పడనుండగా,
నిను బోలిన సుర పావని తానై వరునరయగా పోవలెనా?"

ఇంత మంచి సాహిత్యాన్ని తెలుగు లోకానికి అందించిన శాస్త్రి గారు ధన్య జీవులు కదా!!

ఈ పాటను http://www.youtube.com/watch?v=bwMWTa2KmmA&feature=related లో చూడవచ్చు

Apr 13, 2010

కమలాపురం సంతాన గోపాలాచార్యులు, ఆంధ్ర, తమిళ, మలయాళ, సంస్కృత భాషల్లో రామాయణ, భారత, భగవత్గీత పైన ఉపన్యాసాలు ఎంతో అద్భుతంగా ఇచ్చిన మహానుభావులు. ధనుర్మాసంలో తిరుప్పావై పైన వారి ఉపన్యాసానికి కనీసం ఒక వెయ్యి మంది వచ్చేవారు. వారి కుమారుడు వారి సుందరకాండ ప్రవచనాలని CD రూపంలో పొందు పరిచారు. విని తరించాల్సిన ప్రవచానాలివి. గత ఏడు రోజులు గా ఎన్ని మార్లు ఈ ప్రవచనాలని విన్నానో అంతే ఆనందాన్ని మళ్లీ మళ్లీ పొందినాను.

Mar 8, 2010

సీతారామ శాస్త్రి

సీతారామ శాస్త్రి గారి పాటలు ఒక్కొక్కటి ఒక్కో జాతి ముత్యం, రవి చెప్పినట్టు ఉత్తేజపరిచే పాటలు చాల రాశారు ఆయన. నాకు నచ్చిన పాటల్లో ఆయన సిరివెన్నెల సినిమాలో ఓం కారాన్ని నిర్వచిస్తూ రాసినది....

"కనుల కొలను లో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం"
"ఎద కనుమలలో ప్రతి ధ్వనించిన విరించి విపంచి గానం"

ఆయన పద జాలం ఆయనకే సాధ్యం!!!

Feb 13, 2010

ఒక నాటి సాయంత్రం

నిన్న ఒక మంచి పాటవిన్నాన్రా సీను "కిరాతార్జునీయం" వేటూరి వ్రాసినది...

అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తాడు దానితో ...."కంపించెనంతలో కైలాసమావేళ కనుపించెనంత అకాల ప్రళయ జ్వాల" ఇది గమనించిన సాంబ శివుడు చిరు నవ్వు తో అంబ వైపు చూశాడు, సీను, సాంబ అంటే "అంబ తో కూడి వున్నా వాడు" అని అర్థం వేటూరి ఎంత బాగా రాస్తాడు ఇక్కడ తెలుసా, "జగము లేలిన వాని సగము నివ్వెర బోయే, సగము మిగిలిన వాని మొగము నగవై పోయే" ఇక అర్జునుడికీ శివుడికి యుద్ధం, మరి అర్జునుణ్ణి రాబోయే భారత సంగ్రామంలో విజయునిగా నిలబెట్టాలి కదా! కిరాతునిగా శివుడి మారతాడు కూడా అమ్మ తరలి వచ్చింది.

అనితర సాధ్యంగా మన వేటూరి కూడా వ్రాస్తాడు "నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె తలపైని గంగమ్మ తలపులోనికి బారె" చూసావా ఇక్కడ "గంగ", ఆలోచన" రెండూ కూడా "పారే" లక్షణం కలవి కదా!! అందుకే కవి గంగమ్మను శివుని "తలపులోనికి" ప్రవహింప చేసాడు, నిప్పులువిసే కన్నునిదురోయి బొట్టవుతే, బూది పూతకు మారు పులితోలి వలువయ్యిందిట, ఎరుకగల్గిన శివుడు ఎరుకగా మారగా, తల్లి పార్వతి మారె తాను అరుకతగా అని శ్లేష చాల బాగా ప్రయోగించాడు కవి... ఎంత మంచి భావం కదరా శీను!! అసలు పద గుంభనం అంటే మన వేటూరిదే సుమా సప్త పది లో కూడా "రేపల్లియ...." పాట లో "మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి...." అని చాల అందంగా అంటాడు మన వేటూరి....

నిజమేరా అసలు తెలుగు లోనే వుంది ఈ అందం అంతా, కదా!! ఇద్దరమూ సంతృప్తిగా నవ్వుకుని ఆ రోజుకి ఇళ్ళకి బయలు దేరాం.
.........





Feb 1, 2010

అద్వైతం
నీ కంటి కలలకు తోరణాలు కట్టి
కన్నీటి అలలకు దోసిళ్ళు పట్టి
తనివార నీ కళ్ళు ముద్దిడుకోన
మనసార నా కళ్ళలో నింపుకోన
పన్నీరు జాల్వారు నీ గుండెలోని
ఊసులన్నీ కూడ నాకు గురుతేలే
నీవు నేనన్న సంగతే మరచి
మల్లెపూలా తెప్ప కట్టి ఈ రేయి లోన
గోదారి గంగలో దాగిపోదాములే
యశోదా మోహన్

Jan 31, 2010

"మాతృమూర్తి"
చిన్ని నా మనసునకు చేయూతనిచ్చినావు
పొరలు నా హృదయానికి పొందికనందించినావు
నా కంట నీరు చూసి నీవు కరగిపోయినావు
నీ కంటి నీటి తో నన్నుఅమృతమయుణ్ని చేసినావు
ఓనమాలు నేర్పించిన నీవు ఓంకారంలో అర్థాన్ని స్ఫురింప చేసినావు
అక్షరాలూ దిద్దించిన నీవు అక్షర సత్యంగా నిలచినావు
నను గన్న తల్లి బదులుగా నీకేమివ్వగలను?
కదిలిన ఈ కన్నీరు తప్ప!
నీవు నేర్పిన ఈ అక్షరాలు తప్ప!
యశోదా మోహన్